ఉత్తరాఖండ్ వెళ్లే యాత్రికులు కేదార్ నాథ్ వెళ్లినప్పుడు అక్కడ నడవలేని వారు చాలా మంది గుర్రాలు, గాడిదల మీద వెళ్తుంటారు. స్థానిక వ్యాపారులకు ఇదో ఆదాయ వనరు. అయితే, డబ్బుల కోసం కనీసం ఆ మూగజీవాలకు రెస్ట్ కూడా ఇవ్వకుండా రాత్రి, పగలు వాటితో పనులు చేయిస్తుంటారు. జనాలను, సంచులను మోయిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మూగజీవాల హింస మీద ఉత్తరాఖండ్ హైకోర్టులో ఓ పిటిషన్ నమోదైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేదార్ నాథ్ మార్గంలో రాత్రిపూట గుర్రాలు, గాడిదల మీద ప్రయాణాన్ని నిషేధించింది. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఇక నుంచి వాటిని వినియోగించకూడదు. హైకోర్టు ఆదేశాలతో చార్ ధామ్ బోర్డు, స్థానిక జిల్లా అధికారులు ఆ మేరకు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని టూర్ ఆపరేటర్లు, స్థానిక గుర్రాలు, గాడిదల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. హిమాలయాల అంచుల్లో ఉండే కేదార్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో ఎక్కువ మంది ఈ గుర్రాలు, గాడిదల మీదే వెళ్తుంటారు. అలాగే, అక్కడికి తీసుకుని వెళ్లే సామగ్రిని కూడా వాటి మీదే తరలిస్తూ ఉంటారు. ఏప్రిల్ 30న చార్ థామ్ యాత్ర ప్రారంభమైన మొదటి రెండు, మూడు వారాల్లోనే 20 కిపైగా గుర్రాలు / గాడిదలు చనిపోయాయి. దీంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కేవలం 16 మాత్రమే చనిపోయాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా వాస్తవంగా ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా. దీంతో వెంటనే చార్ ధామ్ యాత్రలో గుర్రాలు, గాడిదల వినియోగంపై ఒక్కరోజు సస్పెన్షన్ విధించారు.
కేదార్ నాథ్ లో రాత్రిపూట గుర్రాలు, గాడిదల మీద ప్రయాణాన్ని నిషేధించిన హైకోర్టు
June 02, 2025
0
Tags