దేశంలో పెరుగుతున్న తప్పిపోయిన పిల్లల కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో మిస్సింగ్ కేసుల పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను తప్పనిసరిగా నియమించాలని కోర్టు ఆదేశించింది. 'గురియా స్వయం సేవి సంస్థాన్' అనే స్వచ్ఛంద సంస్థ పిల్లల అదృశ్యం, అక్రమ రవాణాపై ప్రజా ప్రయోజన వ్యాజ్యంను దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు విచారణ సందర్భంగా కోర్టు "దేశవ్యాప్తంగా వేలాది పిల్లలు ప్రతి సంవత్సరం అదృశ్యమవుతున్నారు. వీరిలో చాలా మంది మానవ రవాణా, శారీరక దుర్వినియోగం, బలవంతపు కార్మిక వ్యవస్థల్లో చిక్కుకుంటున్నారని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు, నోడల్ అధికారుల వివరాలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ పోర్టల్లో ప్రతి రాష్ట్రం, జిల్లాకు సంబంధించిన నోడల్ అధికారుల పేర్లు, సంప్రదింపు నంబర్లు, ఇమెయిల్ వివరాలు ఉంచాలి. తప్పిపోయిన పిల్లల గురించి వచ్చిన ఫిర్యాదులు వెంటనే ఆ అధికారులకు చేరేలా సిస్టమ్ను రూపొందించాలి. ఆ ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలు కూడా రియల్టైమ్లో అప్డేట్ చేయాలి. కోర్టు అభిప్రాయం ప్రకారం, ఈ ఆన్లైన్ వ్యవస్థ స్పష్టతను పెంచి, అధికారుల బాధ్యతను నిర్ధారిస్తుంది. ఈ మేరకు తప్పిపోయిన పిల్లల గురించి ఫిర్యాదు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మొదటి 24 గంటలు అత్యంత కీలకమని, ఆలస్యం జరిగితే పిల్లలను వెతికే అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరించింది. నోడల్ అధికారులు సంబంధిత పోలీసు స్టేషన్లతో సమన్వయం చేసుకోవాలి. పిల్లల ఫోటోలు, వివరాలను ఆన్లైన్ పోర్టల్ మరియు సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ప్రతి కేసుపై వారానికి ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించాలి. ఈ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదులను కిడ్నాప్ లేదా ట్రాఫికింగ్ కేసులుగా కోర్టు నమోదు చేసి విచారణ చేపట్టాలని సూచించింది. పిల్లలను అపహరించే నేరస్థులపై కఠిన శిక్షలు విధించడానికి కేంద్రం, రాష్ట్రాలు తగిన చట్టపరమైన మార్పులను పరిగణలోకి తీసుకోవాలని కూడా సూచించింది. పిల్లల అదృశ్యం అనేది కేవలం కుటుంబాల సమస్య కాదని, అది సమాజం మొత్తం ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభమని న్యాయస్థానం పేర్కొంది. అందుకే కేంద్రం, రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఒక సమగ్ర చర్యా ప్రణాళిక రూపొందించాలని సిఫార్సు చేసింది. అందుకోసం.. స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు, పిల్లల భద్రత కోసం హెల్ప్లైన్ నంబర్లు.. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక 'చైల్డ్ ట్రేసింగ్ యూనిట్' ఏర్పాటు వంటి అంశాలు ఉండాలని కోర్టు సూచించింది.
తప్పిపోయిన పిల్లల కేసుల వ్యవహారంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు : కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలుజారీ
October 14, 2025
0
Tags