దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన విదేశీయులకు భారత్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు చర్యలు !

Telugu Lo Computer
0


దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన విదేశీయులు భారత్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గతంలో భారత్‌కు వచ్చి గూఢచర్యం, అత్యాచారం, హత్య, ఉగ్రవాద చర్యలు, నిషేధిత సంస్థలలో సభ్యులుగా ఉండటం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలపై దోషులుగా తేలి వారి దేశాలకు వెళ్లిపోయిన విదేశీయులపై ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది. అటువంటి వారు తిరిగి భారత్‌లోకి ప్రవేశించకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అలాంటి వారిని గుర్తిస్తే వారిని నిర్బంధించాలని పేర్కొంది. ఇటీవల ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ చట్టం (2025) ప్రకారం దేశవ్యతిరేక చర్యలకు పాల్పడిన విదేశీయులను గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లు లేదా నిర్బంధ శిబిరాలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విషయంలో సరిహద్దు రక్షణ దళాలు, కోస్ట్ గార్డులు కూడా బాధ్యత తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. సరిహద్దుల వద్ద భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించే అక్రమ వలసదారులను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అంతే కాకుండా భారత్‌లో ఉద్యోగం చేయడానికి చెల్లుబాటు అయ్యే వీసా ఉన్న విదేశీయులు ఇక్కడి పౌర అధికారుల అనుమతి లేకుండా విద్యుత్‌, నీరు, పెట్రోలియం వంటి వాటికి సంబంధించిన ప్రైవేటు ఉద్యోగాల్లో చేరకూడదని షరతు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పర్వతారోహణ యాత్రలు సైతం చేపట్టొద్దని సూచించింది. అప్ఘనిస్థాన్‌, చైనా, పాకిస్థాన్‌లలో జన్మించిన విదేశీయులకు భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, ఉత్తరాఖండ్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశం నిషిద్ధమని తెలిపింది. అవి సున్నితమైన సరిహద్దు ప్రాంతాలు కాబట్టి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)