అమెరికాకు పోస్టల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన భారత్

Telugu Lo Computer
0


మెరికాకు అన్నిరకాల పోస్టల్ సేవలను భారత్ నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలికమేనని పోస్టల్ విభాగం వెల్లడించింది. ఈ నెలాఖరులో అమల్లోకి వచ్చే కస్టమ్ నిబంధనల కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆగస్టు 25 నుంచి ఈ సేవలు నిలిచిపోనున్నాయి. జులై 30న అమెరికా యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం 800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంది. ఫలితంగా అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ సర్వీసులకు వాటి విలువతో సంబంధం లేకుండా సుంకాలకు లోబడి ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన వచ్చింది. వంద డాలర్ల విలువైన గిఫ్ట్‌ ఐటెమ్స్‌, లేఖలు, దస్త్రాలకు మాత్రం సుంకాల నుంచి మినహాయింపు కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. మిత్రదేశం భారత్‌ను వదల్లేదు. రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 27 నుంచి 50శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్‌ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్‌హౌస్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నరావో ఇప్పటికే పేర్కొన్నారు. గతంలో ట్రంప్‌ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఈ సుంకాల వసూళ్లకు సంబంధించి యూఎస్‌ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వద్ద కచ్చితమైన మార్గదర్శకాలు లేవు. ఈ అనిశ్చితి నేపథ్యంలో ఆగస్టు 25 తర్వాత అమెరికాకు వచ్చే పోస్టల్ కన్‌సైన్‌మెంట్లను స్వీకరించలేమని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. దీంతో యూఎస్‌కు పంపే పోస్టల్ పార్శిళ్ల బుకింగ్‌లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే బుకింగ్ పూర్తిచేసినవారికి రీఫండ్ సౌలభ్యం ఉంది. అలాగే సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)