ఆసియా కప్ 2025 జట్టును ప్రకటించిన భారత సెలెక్షన్ కమిటీ

Telugu Lo Computer
0


సియా కప్ 2025 బరిలోకి దిగే భారత జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మంగళవారం వెల్లడించారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అగార్కర్ ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జట్టు ఎంపికకు సంబంధించిన వివరాలతో పాటు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అందరూ ఊహించినట్లుగానే భారత జట్టులో పెద్ద మార్పులేమి జరగలేదు. కుర్రాళ్లతో కూడిన జట్టునే సెలెక్టర్లు కొనసాగించారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతను సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడని అగార్కర్ తెలిపాడు. జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు చోటు దక్కలేదు. సంజూ శాంసన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మను ఎంపిక చేశారు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబే అవకాశాన్ని అందుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలను కొనసాగించారు. మూడో పేసర్‌గా హర్షిత్ రాణాను తీసుకున్నారు. ఆసియా కప్ 2025 నుంచి సిరాజ్‌ను దూరంగా ఉంచారు. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025 జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అబుదాబి, దుబాయ్ వేదికగా మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ఆసియాకప్ క్యాంపైన్‌ను మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. యూఏఈ, పాకిస్థాన్, ఓమన్‌తో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉంది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)