టీ20 కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ?

Telugu Lo Computer
0


ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా సత్తా చాటిన శుభ్‌మన్ గిల్‌కు టీ20 సారథ్య బాధ్యతలు కూడా దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా సత్తా చాటాడు. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో టీమిండియా సమం చేసుకుంది. శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 75.40 సగటుతో 754 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ ప్రదర్శనతో కెప్టెన్సీ తనకు ఎలాంటి భారం కాదని గిల్ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్‌ను మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రోహిత్‌తో పాటు కోహ్లీల వన్డే భవితవ్యం గురించి వారితో చర్చిస్తామని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. మరోవైపు టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. రోహిత్ శర్మ టీ20 రిటైర్మెంట్ అనంతరం సారథ్య బాధ్యతలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు వరుస విజయాలు అందించాడు. అతని సారథ్యంలోని టీమిండియా.. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై సిరీస్‌లు గెలిచింది. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగుతాడని కూడా సెలెక్టర్లు చెప్పారు. కానీ సూర్యకుమార్ యాదవ్ హెర్నియా సర్జరీ చేయించుకొని ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. మునపటిలా అతను రాణించగలుగుతాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో అతనికే సారథ్యం బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెస్ట్, టీ20, వన్డే మూడు ఫార్మాట్లలో శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా చేసి మెగా టోర్నీలకు జట్టును సిద్దం చేయాలనే వాదన వినిపిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)