సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు గజమాలతో ఘన సన్మానం

Telugu Lo Computer
0


ఢిల్లీ లలిత్ హోటల్‌లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఘనంగా గజమాలతో సన్మానం జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మానం పట్ల గవాయ్ ఉద్వేగానికి గురయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కిటెక్ట్ అవుదామని అనుకున్నా కానీ తండ్రి గారి కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం న్యాయవాద వృత్తి ఎంచుకున్నట్లు తెలిపారు. 22 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించడం గర్వంగా ఉందని చెప్పారు. 16 ఏళ్ల పాటు మహారాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, ఆరేళ్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించగలిగాను అంటే దానికి అంబేద్కర్ భావజాలమే కారణం అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చిన తొలి రోజుల్లో భయం భయంగా గడిపేవాడినని, ఆ భయాన్ని తోటి న్యాయమూర్తులు పోగొట్టారన్నారు. తీర్పుల విషయంలో సహచర న్యాయమూర్తులు చేదోడు వాదుడుగా ఉండటం సంతృప్తి కలిగించిందన్నారు. దేశంలో ఉన్న నాలుగు వ్యవస్థల్లో న్యాయవ్యవస్థ చాలా కీలకమైందని తెలిపారు. కోర్టులకు న్యాయం కోసం వచ్చే వారి విషయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు రూల్ ఆఫ్‌ లా పాటిస్తూ వారికి న్యాయం చేయాలని పేర్కొ్న్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు క్రమ శిక్షణతో ఉండాలని కోరారు. సుప్రీంకోర్టు 52వ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ (బీఆర్ గవాయ్) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. దేశంలోనే తొలి బౌద్ధ సీజేఐగా, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత రెండో ఎస్సీ చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. 2025, నవంబర్ 23 వరకు ఆయన సుప్రీం కోర్టు సీజేఐగా కొనసాగుతారు. గవాయ్.. 1960.. నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. తండ్రి పేరు రామకృష్ణ సూర్యభాన్ గవాయ్. ఆయన అంబేద్కర్‌తో కలిసి పనిచేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయి) స్థాపకుడు. బీహార్, సిక్కిం, కేరళ గవర్నర్‌గా పనిచేశారు. జస్టిస్ గవాయ్ తల్లి టీచర్.

Post a Comment

0Comments

Post a Comment (0)