ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో మార్చి రెండో వారంలో ఇద్దరు ఇంజినీర్లు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్నారు. ఒకే మహిళా డాక్టర్ వారికి సర్జరీలు చేశారు. సర్జరీలు వికటించి ఇద్దరు ఇంజినీర్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న డాక్టర్ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనుష్క తివారీ అనే మహిళా డాక్టర్ తనకు అర్హతలు లేకపోయినా కాన్పూర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వినీత్ కుమార్ దూబే, ప్రమోద్ కతియార్ అనే ఇద్దరు ఇంజినీర్లకు మార్చి రెండో వారంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేశారు. అయితే ఆ సర్జరీ వికటించి కేవలం 48 గంటల వ్యవధిలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంజినీర్ వినీత్ కుమార్ మృతిపై అతడి భార్య జయ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆలస్యంగా ఫిర్యాదు చేశారనే కారణంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దాంతో ఆమె చీఫ్ మినిస్టర్కు సంబంధించిన గ్రీవియన్స్ సెల్ను ఆశ్రయించారు. వారి ఆదేశాల మేరకు పోలీసులు మే 9న కేసు నమోదు చేశారు. డాక్టర్ అనుష్క తివారీ కోసం గాలింపు చేపట్టారు.ఈరోజు అనుష్క తివారీ తనకు తానే పోలీసుల ముందు లొంగిపోవడంతో ఆమెను కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు.
హెయిర్ సర్జరీ వికటించి ఇద్దరు ఇంజినీర్లు మృతి : అజ్ఞాతం నుంచి బయటికి లొంగిపోయిన మహిళా డాక్టర్
May 26, 2025
0
Tags