హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లాహోర్లోని అనార్కలీ బజార్లో ఆమె పర్యటించినపుడు చుట్టూ ఆరుగురు సాయుధులు భద్రతగా ఉన్నారు. స్కాట్లాండ్ యూట్యూబర్ కాలమ్ మిల్ తీసిన ఈ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. జ్యోతి మల్హోత్రా లాహోర్కు వెళ్లిన సమయంలో మిల్ కూడా అక్కడే ఉన్నాడు. అనార్కలీ బజార్లో జ్యోతి వీడియో తీస్తుండగా మిల్ తీసిన వీడియోలో ఆమె కనిపించారు. ఈ సందర్భంగా జ్యోతిని మిల్ పలకరించాడు. తాను భారతీయురాలినని జ్యోతి పరిచయం చేసుకుంది. పాకిస్తాన్కు రావడం ఇదే తొలిసారా? అని జ్యోతి ప్రశ్నించగా, ఐదు సార్లు వచ్చానని మిల్ చెప్పాడు. పాక్లో ఆతిథ్యం బాగుందా? అని మిల్ అడగగా చాలా బాగుందని జ్యోతి చెప్పింది. ఆమె చుట్టూ అందరూ యువకులే తుపాకులు పట్టుకుని భద్రతగా ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'చూడండి ఆమె చుట్టూ ఆరుగురు గన్మెన్ ఉన్నారు. ఇంత భారీ భద్రత ఉండటం చూస్తే ఈ ప్రాంతం సురక్షితం కాదు' అని వ్యాఖ్యానించాడు. మిల్ ఈ వీడియోను తన చానల్లో పోస్టు చేశాడు. పాక్ పర్యటనలో జ్యోతికి అసాధారణ భద్రత కల్పించడంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పర్యటనలో అసాధారణ భద్రత : సోషల్ మీడియాలో వీడియో వైరల్
May 27, 2025
0
Tags