బూత్‌ల వారీగా ఓటింగ్‌ శాతం అప్‌లోడ్‌పై సుప్రీంకోర్టులో విచారణ !

Telugu Lo Computer
0


ప్రతి దశ పోలింగ్‌ తరువాత బూత్‌ల వారీగా నమోదైన స్పష్టమైన ఓటింగ్‌ శాతాన్ని ఇసిఐ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కోరుతూ ఎన్‌జిఓ ఎడిఆర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌దారులతో సమావేశమై వారి డిమాండ్లపై చర్చించాలని ఇసిఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి ఎన్నికల సంఘం అంగీకరించింది. దీంతో వచ్చే పది రోజుల్లోగా ఇసిఐ ముందు సమావేశానికి హాజరుకావాలని పిటీషనర్లను సిజెఐ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఎడిఆర్‌ తరుపున న్యాయవాదులు ప్రశాంత్‌ భూషణ్‌, నేహ రతి, చెర్లీ డి సౌజ వాదనలు వినిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇసిఐ ప్రారంభంలో విడుదల చేసి ఓటింగ్‌ శాతానికి, తరువాత విడుదల చేసిన తుది ఓటింగ్‌ శాతానికి తీవ్రమైన వ్యత్యాసం వుందని, అలాగే ఈ తుది వివరాలు విడుదల చేయడానికి విపరీతమైన జాప్యం జరిగిందని పిటిషన్‌ తరుపు న్యాయవాదులు వాదించారు. 'పౌరులకు తెలుసుకునే హక్కు ఉంది. అభ్యర్థుల నేర చరిత్ర పౌరులకు తెలిసేలా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఈ కేసులోనూ జోక్యం చేసుకోవాలి' అని అభ్యర్థించారు. దీంతో పిటిషనర్ల డిమాండ్ల విషయంలో వారితో సమావేశం నిర్వహించాలని ఇసిఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. గత విచారణలో ఓటింగ్‌ శాతం డేటాను బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసిన ఎన్నికల సంఘం, తాజా విచారణలో మాత్రం పిటిషనర్లతో సమావేశానికి అంగీకరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)