నా 'మండే మోటివేషన్‌' డి.కృష్ణ భాస్కర్‌ : ఆనంద్‌ మహీంద్రా

Telugu Lo Computer
0


ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రతి సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటారు. ఈరోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్‌ను షేర్‌ చేశారు. యువ ఐఏఎస్‌ అధికారి డి.కృష్ణ భాస్కర్‌ కథనాన్ని పంచుకున్న ఆయన, ఆ అధికారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపారు. ''వ్యవసాయ రంగం గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. భూగర్భ జలాల స్థాయిలను పెంచడంలో దేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో మన అందరికీ బాగా తెలుసు. అలాంటి సమయంలో ఈ యువ ఐఏఎస్‌ అధికారి కృష్ణభాస్కర్‌ సాధించిన విజయాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే. సమస్య ఎలాంటిదైనా దాన్ని అధిగమించగలమని ఆయన మనలో విశ్వాసాన్ని నింపగలిగారు. దానికి కావాల్సిందల్లా దృఢ సంకల్పమే అని రుజువు చేశారు. అందుకే ఆయనే నా మండే మోటివేషన్‌'' అని మహీంద్రా ప్రశంసలు కురిపించారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్‌ అధికారి దేవరకొండ కృష్ణ భాస్కర్‌ రాజన్న సిరిసిల్లా జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అద్భుత విజయాలు సాధించారు. నీటి కొరతను అధిగమించేందుకు పలు చర్యలు చేపట్టారు. పైపుల ద్వారా నీటి సరఫరా, రిజర్వాయర్లకు భూమి సేకరణ, నీటి వనరుల కోసం పూడికతీత వంటి చర్యలతో నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచారు. నీటి లభ్యతను విస్తృతంగా పెంచడం కోసం రిజర్వాయర్ల సమీపంలో చిన్న ట్యాంకులను ఏర్పాటుచేశారు. ఆయన చర్యలతో నాలుగేళ్లలోనే భూగర్భ జలాల స్థాయిలను ఆరు మీటర్ల మేర పెంచగలిగారు. ఆయనకు సంబంధించి ఓ స్ఫూర్తిదాయక కథనాన్ని గతేడాది జూన్‌లో 'బెటర్‌ ఇండియా' పేజీ పంచుకుంది. ఆ పోస్ట్‌నే తాజాగా ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేస్తూ ఈ యువ అధికారిపై ప్రశంసలు కురిపించారు. కృష్ణకుమార్‌ సేవలకు గానూ 2019, 2020లో వరుసగా రెండుసార్లు ప్రజా పాలనలో ప్రధానమంత్రి అత్యుత్తమ అవార్డును అందుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)