బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా గత నాలుగైదు రోజులుగా తగ్గినట్లే కనిపించినా ఇప్పుడు ఒక్కసారిగా ఊహించని మార్పు కనిపించింది. మరోసారి జీవన కాల గరిష్టాలకు చేరాయి. ఇవాళ ఇంట్రాడేలో స్పాట్ గోల్డ్ రేటు 31.10 గ్రాములకు 3059 డాలర్ల మార్కు వద్ద రికార్డు గరిష్టాల్ని చేరుకుంది. కిందటి సెషన్ లో 3020 డాలర్ల స్థాయిలో ఉండగా, ఒక్కరోజే ఒక శాతానికిపైగా పెరిగి చరిత్రలో తొలిసారి పసిడి ధర ఈ స్థాయికి చేరింది. అమెరికా ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలను పెంచడంతో ఆర్థిక అనిశ్చితి పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో గత వారం రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో రేట్లు పుంజుకున్నాయి. విదేశాల్లో తయారై అమెరికాలోకి దిగుమతి అయ్యే కార్లపై దిగుమతి సుంకాల్ని 25 శాతం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానుందని వెల్లడించారు. వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి పెరిగాయి. అందుకే ఒక్కసారిగా ఈ మార్పు కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. బంగారం అంటే పెట్టుబడిదారులకు నమ్మకం. ఏదైనా సంక్షోభం వస్తే ఆదుకుంటుందని భావిస్తుంటారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధర 15 శాతానికిపైగా పెరగడం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 17 సార్లు బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకుంది. దేశీయంగా హైదరాబాద్ లో తాజాగా రూ. 400 పెరగ్గా 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 82,350 వద్ద ఉంది. ఇది వాస్తవ ధర కాదని గుర్తుంచుకోవాలి. జువెల్లరీ కొనుగోలు చేసినప్పుడు మేకింగ్ ఛార్జీలు సహా 3 శాతం జీఎస్టీ, హాల్ మార్క్ ఛార్జీలు వంటివి వర్తిస్తాయి. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 440 పెరిగింది.దీంతో ఇప్పుడు రూ. 89,840 వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.3 శాతం పెరిగి 3069 డాలర్లకు చేరుకుందని రాయిటర్స్ ప్రకటించింది. సాధారణంగా బంగారం అనేది.. అనిశ్చితి సమయంలో.. ఆర్థిక మందగమనం సమయంలో.. అధిక ద్రవ్యోల్బణం సమయంలో.. సురక్షిత పెట్టుబడి సాధనంగా మారుతుంది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ నిర్ణయాలతో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం.. ఆర్థిక వృద్ధి మందగమనం సంకేతాలు ఉన్నాయి. దీంతోనే రేట్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల సమయంలోనూ బంగారం ధర పెరుగుతుంటుంది. దీనికి తోడు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల కంపెనీ గోల్డ్మన్ సాక్స్ కూడా బంగారం ధరలను సవరించింది. ఈ ఏడాది చివరినాటికి ఔన్సుకు 3300 డాలర్లకు పెరుగుతుందని పేర్కొంది. గతంలో 3100 డాలర్లుగానే అంచనా వేసింది. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం విపరీతంగా కొనుగోలు చేస్తుండటం సహా ఈటీఎఫ్లోకి పెట్టుబడుల ప్రవాహం పసిడికి మరింత బలం చేకూరుస్తుందని తెలిపింది.
ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన బంగారం ధర !
March 28, 2025
0
Tags