ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతోన్న 38వ జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీచ్ వాలీబాల్ టీమ్ గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. ఈ తుది పోరులో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కె.మణికంఠరాజు, ఎల్.దివ్యసాయి ద్వయం 25-23, 21-19 తేడాతో తమిళనాడు జోడీపై విజయాన్ని అందుకుంది. బాక్సింగ్ 91 ప్లస్ కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన బాక్సర్ అబ్దుల్ జావేద్ కాంస్యం పతకాన్ని గెలుచుకున్నాడు. ఆర్చరీ విభాగంలో సీనియర్ దీపిక కుమారి, 18 ఏళ్ల జుయెల్ సర్కార్ విజయం సాధించారు. మహిళల రికర్వ్ సింగిల్స్ ఫైనల్ లో దీపిక 6-4 తేడాతో అంకిత (బిహార్)పై పోరాడి గెలిచింది. అయితే పురుషుల రికర్వ్ సింగిల్స్లో స్టార్ ఆర్చర్ తరుణ్ దీప్ రాయ్కు మాత్రం నిరాశే ఎదురైంది. సెమీ ఫైనల్లో తరుణ్ 2-6 తేడాతో 18 ఏళ్ల జుయెల్పై పరాజయం పొందాడు. అయినప్పటికీ అతడు బ్రాంజ్ మెడల్ ను సంపాదించుకున్నాడు. కంచు పోరులో ఇంద్ర చంద్ను తరుణ్ దీప్ 6-4 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఇక రికర్వ్ టీమ్ విభాగంలో ఝార్ఖండ్ జట్టు విజేతగా నిలిచింది. దీపిక, అంకిత భాకత్, కోమలిక, తమన్నాతో కూడిన మహిళల జట్టు 0-6 తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించింది.
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు గోల్డ్, తెలంగాణకు కాంస్యం !
February 07, 2025
0
Tags