శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో పన్ను కట్టకుండా అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్, అక్రమ హోర్డింగ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలకు దిగింది. అలాగే శంషాబాద్లోని సిద్ధాంతి జాతీయ రహదారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ప్రాంతంలోని హోర్డింగ్లను తొలగించడానికి హైడ్రా సిబ్బందితో సహా ఇక్కడికి వచ్చి పరిశీలన జరుపుతోంది. రెండు రోజుల క్రితం శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్లు 601, 602 లో చేపట్టిన ప్రహరీ గోడను కూల్చివేశారు. వివాదాస్పద రోడ్డు స్థలం విషయంలో ఫిర్యాదులు రావడంతో కూల్చివేశారు. అయితే తమ పట్టా భూమిలో తాము నిర్మించుకున్న ప్రహరీ గోడను హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసారని బాధితులు మండిపడుతున్నారు. కాగా నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. పలు ప్రాంతాల్లో అక్రమంగా వ్యర్థాలు డంప్ చేస్తోన్న నాలుగు టిప్పర్లను హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు పట్టుకున్నాయి. ఉందాసాగర్లో వ్యర్థాలు పోస్తోన్న నాలుగు టిప్పర్లు, పోసిన మట్టిని వెంటనే చదును చేస్తోన్న ప్రొక్లెయినర్నూ పట్టుకున్నారు. అలాగే కూకట్ పల్లి నిజాంపేట మెయిన్ రోడ్డులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను జేసీబీలతో హైడ్రా అధికారులు కూల్చివేశారు. నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వెనక భాగంలో ఆర్మీ ఉద్యోగికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలం చుట్టుపక్కల వాళ్లు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు. ప్రహరీగోడలు కట్టేశారు. కొన్నేళ్లుగా ఈ విషయంపై ఆర్మీ ఉద్యోగి పోరాటం చేస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలో ఆర్మీ ఉద్యోగి ఆధారాలతో సహా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని నిర్థారించి గురువారం జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఆర్మీ ఉద్యోగికి స్థలాన్ని అప్పగించారు.
అక్రమ హోర్డింగ్లను కూల్చివేసిన హైడ్రా !
February 07, 2025
0
Tags