మహారాష్ట్ర లోని నాగ్పూర్ వేదికగా గురువారం ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్లో హర్షిత్ రాణా, జడేజా సత్తా చాటగా, బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ రాణించారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్ (64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/26), అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా (3/53) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహ్మూద్(2/47), ఆదిల్ రషీద్(2/49) రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, జాకోబ్ బెతెల్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ ఫీల్డింగ్తో ఫిల్ సాల్ట్ను రనౌట్ చేసిన అయ్యర్.. బ్యాటింగ్లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత దూకుడుగా ఆడి మ్యాచ్ను భారత్వైపు మలుపు తిప్పాడు. ఇంగ్లండ్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్కు కలిసొచ్చింది.
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం !
February 06, 2025
0
Tags