చైన్నై, తేనాంపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో బుధవారం డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాలనాపరమైన వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటున్న గవర్నర్ కు ప్రవర్తనా నియమావళి రూపొందించాలని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై సంతకం చేసేందుకు గవర్నర్కు నిర్ణీత గడువు కూడా విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ డీఎంకే ఎంపీల సమావేశంలో ఓ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్రాలకు గవర్నర్లు అవసరం లేదని డీఎంకే మొదటి నుండి వాదిస్తున్నప్పటికీ గవర్నర్ పదవికి గౌరవ మర్యాదలను ఇస్తూనే ఉందని, అయితే ప్రస్తుత గవర్నర్ రవి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన పదవికే కళంకం తెస్తున్నారని ఆరోపించింది. ఈ పరిస్థితులలో రాజకీయమయమవుతున్న గవర్నర్ పదవి గౌరవాన్ని కాపాడుకునేలా, గవర్నర్లకు ప్రత్యేకంగా ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కాండక్ట్)ను రూపొందించాలని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లులకు ఆమోదం తెలిపి సంతకం చేసేందుకంటూ నిర్ణీత గడువును (టైమ్ ఫ్రేమ్) కూడా విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తొలి తీర్మానాన్ని ఆమోదించింది. మదురై సమీపం మేలూరు వద్ద టంగ్స్టన్ తవ్వకాల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును రద్దు చేయించిన ముఖ్యమంత్రికి, ఆందోళనకారులకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక తీర్మానం చేశారు. ఇనుపయుగం 5370 యేళ్లకు మునుపే తమిళనాట ప్రారంభమైందనే విషయాన్ని కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ దేశాలకు ఎలుగెత్తిచాటాలని మూడో తీర్మానంలో కోరింది. వీసీలను నియమించడంపై సెర్చికమిటీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా యూజీసీ విధించిన కొత్త నిబంధనలను ఖండిస్తూ డీఎంకే యువజన విభాగం ఫిబ్రవరి 6న రాష్ట్ర వ్యాప్తంగా జరుపతలపెట్టిన ఆందోళనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని మరో తీర్మానంలో విజ్ఞప్తి చేసింది. అదే రోజున ఢిల్లీలో డీఎంకే ఎంపీలు కూడా ధర్నా చేస్తారని పేర్కొంది. మైనారిటీల సంక్షేమానికి వ్యతిరేకంగా వక్ఫ్బోర్డు చట్టసవరణ బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తూ మరో తీర్మానం చేసింది. గత యేడాది బడ్జెట్లో కనీసం 'తమిళనాడు' అనే పదానికి కూడా తావివ్వని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈయేడాది బడ్జెట్లోనైనా రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించాలని, మరిన్ని రైల్వే పథకాలను అమలుకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆరో తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు కనిమొళి, దయానిధి మారన్, తమిళచ్చితంగపాండ్యన్, జగద్రక్షగన్, తిరుచ్చి శివ, విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్కు ప్రవర్తనా నియమావళి రూపొందించండి : డీఎంకే ఎంపీల సమావేశంలో తీర్మానం
January 30, 2025
0
Tags