పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో వ్యాపారులకు విక్రయదారుల సమాఖ్య కాయిట్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్) కీలక సూచన చేసింది. పేటీఎంకు బదులు లావాదేవీల కోసం చట్టబద్ధమైన ఇతర చెల్లింపు యాప్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఈ సలహా ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది కేవలం సూచన మాత్రమేనని తెలిపింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎంపై ఆందోళనలు రేకెత్తుతున్నాయని, భద్రత విషయంలో చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారని కాయిట్ గుర్తుచేసింది. ఈ వేదిక అందించే ఆర్థిక సేవల కొనసాగింపుపైనా అనుమానాలు నెలకొన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిరంతరాయ లావాదేవీలు, వాటి భద్రత కోసం పేటీఎం నుంచి ఇతర యాప్లకు మారడం మేలని సూచించింది. డైరెక్ట్ యూపీఐ లావాదేవీలు, బ్యాంకులు అందించే పేమెంట్ యాప్లను ఉపయోగిస్తే మంచిదని చెప్పింది.
పేటీఎంకు బదులు ఇతర యూపీఐ యాప్లను పరిగణించండి !
February 04, 2024
0
Tags