యెమెన్లో హౌతీల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ సైన్యాలు మరోసారి విరుచుకుపడ్డాయి. 13 ప్రాంతాల్లో 36 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు అగ్రరాజ్య రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. ఈ చర్యల్లో తమకు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, డెన్మార్క్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ నుంచి మద్దతు లభించినట్లు తెలిపారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులను ఆపకపోతే.. హౌతీలు మరిన్ని కఠినమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయుధ భాండాగారాలు, లాంఛర్లు, గగనతల రక్షణ, క్షిపణి, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఆస్టిన్ తెలిపారు. ఎర్ర సముద్రంలో దాడులు ఆగే వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇరాన్ మద్దతున్న ఈ మిలిటెంట్లు 30కి పైగా దాడులు చేసినట్లు గుర్తుచేశారు. వీటిలో అమెరికా సహా ప్రపంచ దేశాలకు చెందిన నౌకలు ఉన్నట్లు తెలిపారు. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ముప్పు తలపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చట్టబద్ధమైన స్వేచ్ఛా వాణిజ్యాన్ని పరిరక్షించేందుకు హౌతీలపై ప్రతీకార దాడులు తప్పవని స్పష్టం చేశారు.
హౌతీ స్థావరాలపై అమెరికా, యూకే దాడి !
February 04, 2024
0
Tags