మధ్యప్రదేశ్లో కరవు పరిస్థితులు ఏర్పడటంతోపాటు కరెంటు సంక్షోభం నెలకొంది. దీంతో మంచి వర్షాలు కురవాలని భగవంతున్ని ప్రార్థించాలని ఆ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఉజ్జయినిలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఇతర రాష్ట్రాల నుంచి కరెంటును కొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. 'ఆగస్టు నెలలో వర్షాల జాడ లేదు. దాంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు కూడా దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయి. ఈ క్రమంలో వర్షాలు కురవాలని, పంటలు కాపాడాలని మహాకాళి అమ్మవారిని ప్రార్థించా. మంచి వర్షాలు కురవాలని రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, నగరాల్లోని ప్రజలు వారి సంప్రదాయాల ప్రకారం ప్రార్థించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మంచి విశ్వాసంతో ప్రార్థనలు చేస్తే, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు' అని ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఏదేమైనా రైతుల సంక్షేమం కోసం ఏ అవకాశాన్ని వదిలిపెట్టమని అన్నారు. రుతుపవనాల్లో కదలికలు లేకపోవడంతో కొన్ని వారాలుగా చాలా రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు ఆగస్టులో కురిసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది వ్యవసాయంతోపాటు విద్యుత్ డిమాండుపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ అంచనాలు వేయడంతో దక్షిణాది రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి.
వర్షాలు కురవాలని దేవుడిని ప్రార్థించండి !
September 04, 2023
0
Tags