'తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' శనివారం 'సనాతన నిర్మూలన' అనే ఇతివృత్తంతో చెన్నైలో సదస్సు నిర్వహించింది. దీనికి ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని, పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని, ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలపై భాజపా శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ తమిళనాడులో కొంత మంది నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతోందని వ్యాఖ్యానించారు. ఇటీవల నిర్వహించిన కాశీ, తమిళ సంగమం కార్యక్రమాన్ని ఆ రాష్ట్రంలో ప్రతి గ్రామం ఆదరించిందని తెలిపారు. సనాతన ధర్మం శాశ్వతమైనదని, ఇలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యల వల్ల దానికి ఏమీ జరగబోదని అన్నారు. భాజపా మరో నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ 'ఇండియా' కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన తనయుడైన ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అలాగే కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఉదయనిధి వ్యాఖ్యలపై తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.
సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకం !
September 03, 2023
0
Tags