అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయ నిర్మాణం కోసం పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా అధికారులను సంప్రదించినట్లు సమాచారం. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అమెరికాలో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదనలు చేసినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఆంగ్ల మాధ్యమాల కథనాల ప్రకారం, అరేబియా సముద్ర తీరంలో ఓడరేవు నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను అసిమ్ మునీర్ అమెరికా అధికారుల ముందు ఉంచారు. మునీర్ శ్వేతసౌధానికి వెళ్ళడానికి ముందే ఆయన సలహాదారు అమెరికా అధికారులతో ఈ విషయంపై చర్చలు జరిపారు. పాకిస్తాన్ లోని పాస్నీలో లభించే కీలక ఖనిజాల రవాణాకు ఈ ఓడరేవును ఉపయోగించాలని షరీఫ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్ ప్రావిన్స్లో పాస్నీ ఓడరేవు పట్టణంగా ఉంది. అయితే, అరేబియా సముద్ర తీరంలో నిర్మించ తలపెట్టిన ఓడరేవును అమెరికా సైనిక స్థావరాల కోసం ఉపయోగించడానికి పాకిస్తాన్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయ నిర్మాణానికి పాకిస్తాన్ ప్రయత్నం ?
October 04, 2025
0
Tags