పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్యకు పరిష్కారంగా రెండు దశాల గుర్తింపు పరిష్కారాన్ని సూచిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మెజార్టీ దేశాలు అండగా నిలిచాయి. పాలస్తీనా నిత్య రావణకాష్టంగా మారడం, గాజాలో మానవతా సంక్షోభం కొనసాగుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్ ఈ పరిష్కారాన్ని సూచిస్తూ ఐరాసలో ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి భారత్ సహా 142 దేశాలు మద్దతు పలికాయి. పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం చేయాలని, పాలస్తీనాతో పాటు ఇజ్రాయెల్ ను రెండు ప్రత్యేక దేశాలుగా గుర్తించాలని, దురాక్రమణలకు, యుద్దానికి ముగింపు పలకాలని కోరుతూ ఫ్రాన్స్ ఐరాసలో ఈ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి మద్దతుగా 142 దేశాలు ఓటేశాయి. అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా, హంగరీ సహా 10 దేశాలు మాత్రం వ్యతిరేకంగా ఓటేశాయి. మరో 12 దేశాలు తటస్టంగా ఉండిపోయాయి. న్యూయార్క్ డిక్లరేషన్ పేరుతో ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రతుల్ని జూలైలోనే ఐరాస హెడ్ క్వార్టర్స్ లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో అన్ని దేశాలకు అందించారు. ఇందులో వివిధ దేశాల నాయకులు గాజాలో యుద్దానికి ముగింపు పలికేందుకు ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం చూపేందుకు రెండు దేశాల విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఇజ్రాయెల్ సార్వభౌమ పాలస్తీనాకు అంగీకరించాలని సూచించారు. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలపై హింసను ఆపాలని, తూర్పుజెరూసలెం సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో సెటిల్మెంట్లు, ఆక్రమణలు నిరోధించాలని కోరారు. పాలస్తీనా ప్రజల జీవించే హక్కుకు మద్దతు ఇస్తున్నట్లు ఈ తీర్మానం పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, అంతర్జాతీయంగా ఈ ప్రాంతంలో శాంతి, సుస్దిరతలు నెలకొల్పేందుకు, పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలికేందుకు ప్రయత్నించాలని ఇందులో కోరారు. ఈ ప్రయత్నంలో విఫలమైతే సంక్షోభం మరింత తీవ్రమవుతుందని, ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడం కష్టమని హెచ్చరించారు. గాజా పాలస్తీనాలో భాగమని, అది వెస్ట్ బ్యాంక్ తో కలిసే ఉండాలని సూచించారు. అక్కడ ఎలాంటి అక్రమణలు చేయరాదని, ప్రజల్ని తరలించరాదని సూచించారు.
ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ సహా 142 దేశాల అండ !
September 13, 2025
0
Tags