ఏసీ కోచ్ రైల్వే ప్రయాణికులకు ప్రింటెడ్ బ్లాంకెట్ కవర్లు !

Telugu Lo Computer
0


రాజస్తాన్ లోని జైపూర్ ఖాతీపురా రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్లాంకెట్ కవర్ల పంపిణీని పైలెట్ ప్రాజెక్ట్ ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లాంఛనంగా ప్రారంభించారు. జైపూర్ నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ ప్రయాణికులకు వీటిని పంపిణీ చేశారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా 65 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సంబంధించిన ఇతర సౌకర్యాలను కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జైపూర్‌ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రింటెడ్ బ్లాంకెట్ కవర్లపై డిజైన్లను చిత్రీకరించారు. ఇప్పటివరకు ఈ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో ఉండేది కాదు. మడతపెట్టిన దుప్పట్లను మాత్రమే ఏసీ కోచ్ ప్రయాణికులకు ఇచ్చేవాళ్లు. యథాతథంగా తీసుకుని రావడం వల్ల వాటిని ఉపయోగించడానికి ప్రయాణికులు సంకోచించేవాళ్లు. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. ఉతికిన దుప్పట్లను ఇకపై కవర్లల్లో పెట్టి అందజేస్తారు. దుప్పటి కవర్ల పంపిణీని పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే అన్ని రైళ్లలోనూ వీటిని ప్రవేశపెడతామని అన్నారు. జైపూర్, గాంధీనగర్, ఖాతిపురా వంటి 65 రైల్వే స్టేషన్లల్లో అభివృద్ధి పనులను కూడా మంత్రి ప్రారంభించారు. కొత్త ట్రాకుల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్, పట్టాల విద్యుదీకరణతో పాటు ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 77 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి జరుగుతోందని నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశి కిరణ్ తెలిపారు. దీనికి సుమారు 4,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే అయిదు స్టేషన్లు పునరాభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నాయని వివరించారు. దూర ప్రాంతాల్లోని స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంటోన్నామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)