రాజస్థాన్లోని జైపూర్, సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ ట్రామా సెంటర్లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ట్రామా సెంటర్లోని రెండవ అంతస్తులో ఉన్న ఐసీయూ వార్డుకు వ్యాపించడంతో ఆసుపత్రిలో భయాందోళనలు నెలకొన్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఐసీయూలో 24 మంది రోగులు ఉండగా, అందులో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. మంటలను చూసిన ఆసుపత్రి సిబ్బంది, ఐసీయూ వార్డు బయట ఉన్న సహాయకులు వెంటనే గమనించి పేషెంట్లను తీసుకుని పరుగులు తీశారు. సవాయి మాన్ సింగ్ హాస్పిటల్లోని ట్రామా సెంటర్ ఇన్ఛార్జ్ అనురాగ్ ధకాద్ మాట్లాడుతూ ''ట్రామా సెంటర్లో రెండవ అంతస్తులో రెండు ఐసియులు ఉన్నాయి. అందులో ఒకటి ట్రామా ఐసియు, మరొకటి సెమీ-ఐసియు ఉంది. అందులో మొత్తం 24 మంది రోగులు ఉన్నారు. ట్రామా ఐసియులో 11 మంది, సెమీ-ఐసియులో 13 మంది ఉన్నారు. ట్రామా ఐసియులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీని కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. చాలా మంది పేషెంట్లు అపస్మారక స్థితిలో ఉన్నారు. మా ట్రామా సెంటర్ బృందం, మా నర్సింగ్ అధికారులు, వార్డ్ బాయ్లు వెంటనే వారిని ట్రాలీలలోకి ఎక్కించి రక్షించారు. వీలైనంత ఎక్కువ మంది పేషెంట్లను ఐసియు నుండి బయటకు తరలించారు. వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. సీపీఆర్ తో వారిని బతికించడానికి మేము తీవ్రంగా ప్రయత్నించాము. కానీ వారిని రక్షించలేకపోయాము. మరో ఐదుగురు పేషెంట్ల పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారిని పింటు (సికార్), దిలీప్ (ఆంధి), శ్రీనాథ్ (భరత్పూర్), రుక్మణి (భరత్పూర్), ఖుష్మా (భరత్పూర్), బహదూర్ (సంగనేర్)గా గుర్తించారు'' అని ఆయన తెలిపారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలోని సహాయకులు (కుటుంబ సభ్యులు లేదా రోగితో పాటు ఉన్న బంధువులు) తమ పేషెంట్లను, వారి పడకలను తీసుకొని ఆసుపత్రి నుండి బయటకు పరుగులు తీశారు. చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురైన రోగులను వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. SMS ఆసుపత్రి బయట ఆక్సిజన్ సిలిండర్లతో పడకలపై రోగులు పడుకున్నట్లు కనిపించింది. హాస్పిటల్ అధికారులు, అగ్నిమాపక బృందాలు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.
సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి
October 06, 2025
0
Tags