నాలుగు అంతర్జాతీయ రికార్డులు సాధించిన నాగ్‌పూర్ యూనివర్సిటీ

Telugu Lo Computer
0


నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం తుకడోజీ మహారాజ్ 57వ జయంతి సందర్భంగా చరిత్ర సృష్టించింది. విశ్వవిద్యాలయ గీతం 'యా భారత్ బంధుభావ్'ను వేలాదిమంది విద్యార్థులు, అధ్యాపకులు సామూహికంగా ఆలపించి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారు. దీంతోపాటు మరో మూడు ప్రపంచ రికార్డులను కూడా ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ మహోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రులు డాక్టర్ పంకజ్ భోయార్, ఆశిష్ జైస్వాల్, ఎమ్మెల్యే డాక్టర్ ఆశిష్ దేశ్‌ముఖ్, ప్రముఖ హాస్యనటుడు భరత్ గణేష్‌ పురే తదితరులు హాజరయ్యారు. తుకడోజీ మహారాజ్ మహారాష్ట్రలోని ప్రసిద్ధ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన జీవిత సందేశం సేవ, సత్యం, సోదరభావం మీద ఆధారపడి ఉంది. ఆయన బోధనలు నేటి యువతకు నైతిక బలంనిచ్చే మార్గదర్శకాలు. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం ఆయన ఆధ్యాత్మిక విలువలను విద్యా రంగంతో మిళితం చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ మేరకు తుకడోజీ మహారాజ్ బోధించిన కరుణ, మానవతా భావం, సోదరత్వం, ఐక్యత, దేశభక్తి వంటి విలువలను సమాజంలో వ్యాప్తి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో 52,000 మందికి పైగా పాల్గొన్నారు. అందులో 16,000 మంది ప్రత్యక్షంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పాల్గొనగా, మరో 15,000 మందికి పైగా ఆన్‌లైన్ ద్వారా ఈ గానంలో భాగమయ్యారు. ఒకేసారి ఇంతమంది ఒకే విశ్వవిద్యాలయ గీతాన్ని ఆలపించడం ద్వారా అత్యంత పెద్ద ఆన్‌లైన్ వీడియో ఆల్బమ్ కేటగిరీలో గిన్నిస్ రికార్డు నమోదు అయింది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగిన మొదటి ఘనతగా గుర్తింపు పొందింది. గిన్నిస్ ప్రతినిధి ఎమ్మా బ్రెయిన్ ఈ రికార్డును అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ డాక్టర్ మాధవి ఖోడ్ చవరే రికార్డు ధృవపత్రాన్ని నిర్వాహక కమిటీకి అందజేశారు. ఆమె మాట్లాడుతూ తుకడోజీ మహారాజ్ బోధనలు మానవతా విలువలను నిలబెట్టే మార్గమన్నారు. ఈ రికార్డు ఆయన ఆత్మీయ స్ఫూర్తికి అంకితమని తెలిపారు. గిన్నిస్ బుక్‌తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా సంపాదించింది. ఒక్క కార్యక్రమంతో నాలుగు అంతర్జాతీయ రికార్డులు సాధించడం భారతీయ విద్యా రంగానికి విశేషమైన గుర్తింపు తెచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)