ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ, ఏబీవీపీ సభ్యురాలు దీపిక ఝా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ప్రొఫెసర్ సుజీత్ కుమార్పై ఆమె చెయ్యి చేసుకున్నారు. క్రమశిక్షణా కమిటీ భేటీలోఅక్కడ ఉన్న పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ దీపికా ఝా ఓ వీడియో రిలీజ్ చేశారు. సుజీత్ కుమార్ నన్ను తదేకంగా చూశారు. నోటికొచ్చినట్లు తిట్టారు. బెదిరించారు. వెటకారంగా నవ్వారు. తట్టుకోలేకపోయా. అందుకే అలా చేయాల్సి వచ్చింది అని తన చర్యను సమర్థించుకున్నారామె. బహిరంగంగా సిగరెట్ కాల్చడంతో విద్యార్థులు పాడైపోతారని ఆయన్ని మేం ఆపే ప్రయత్నం చేశాం. దీంతో ఆయన క్రమశిక్షణా కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నాతో అనుచితంగా వ్యవహరించాడు. కోపంతో అలా చేయాల్సి వచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని చెబుతూనే జరిగిందానికి టీచర్స్ కమ్యూనిటీకి క్షమాపణలు తెలియజేశారామె. అయితే ఈ ఘటనపై కామర్స్ ప్రొఫెసర్ సుజీత్ కుమార్ వెర్షన్ మరోలా ఉంది. కాలేజీ స్టూడెంట్ కౌన్సిల్లో మూడు పోస్టులకు జరిగిన ఎన్నికల వ్యవహారమే దీనంతటికి కారణమని అంటున్నారాయన. ఈ ఎన్నికకు సంబంధించిన ఎన్ఎస్యూఐ (కాంగ్రెస్ విద్యార్థి విభాగం) సభ్యులపై ఏబీవీపీ సభ్యులు దాడి చేశారని, దీంతో వాళ్లను సస్పెండ్ చేశామని ఆ వ్యవహారంపై చర్చించే సమయంలో కమిటీ ముందు కూడా మరోసారి దాడి జరిగిందని అన్నారాయన. ఈ వ్యవహారంలో తనను రాజీనామా చేయాలంటూ ఎబీవీపీ సభ్యులు ఒత్తిడి చేశారని, ఆ టైంలో దీపిక వచ్చి తనపై దాడి చేసిందని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారాయన. ఈ ఘటనపై ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోషియేషన్ భగ్గుమంది. దీపికా ఝాతో ఆ ప్రొఫెసర్కు క్షమాపణలు చెప్పించాల్సిందేనని పట్టుబడుతోంది. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సైతం ఘటనను తీవ్రంగా ఖండించింది. తీవ్ర దుమారం రేపడంతో ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ నీతా సెహగల్ నేతృత్వంలోని కమిటీ రెండు వారాల్లో నివేదికను వీసీ యోగేష్ సింగ్కు సమర్పించనుంది.
ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన దీపిక ఝా
October 18, 2025
0
Tags