బంజారాహిల్స్‌లో రూ. 750 కోట్లు విలువైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో చేపట్టిన ఆక్రమణలను హైడ్రా తొలగింది. తద్వారా రూ. 750 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ మేరకు హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది. షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఆ క్రమణలను తొలగించినట్టుగా హైడ్రా తెలిపింది. ఐదు ఎకరాల స్థలంలో జలమండలికి ప్రభుత్వం 1.20 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించిందని, అయితే ఈ 1.20 ఎకరాలతో పాటు మొత్తం ఐదు  ఎకరాల భూమి తనదంటూ పార్థ సారథి అనే వ్యక్తి కోర్టుకు ఎక్కినట్టుగా పేర్కొంది. అంతేకాకుండా ఆ ఐదు ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసిన పార్థసారథి బౌన్సర్లతో పాటు వేటకుక్కలను కాపలాగా పెట్టినట్టుగా తెలిపింది. ఈ స్థలంపై కోర్టులో వివాదం కొనసాగుతుండగానే పార్థసారథి ఆ స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుని, షెడ్డులు నిర్మించారని హైడ్రా పేర్కొంది. అక్కడ మనుషులను పెట్టుకుని పహరా కాస్తున్నట్టుగా తెలిపింది. అయితే ప్రభుత్వ భూమిని అడ్డాగా చేసుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు జలమండలి, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినట్టుగా హైడ్రా పేర్కొంది. ఆ స్థలం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని జలమండలి, రెవెన్యూ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నాడని కూడా చెప్పారు. ఫేక్ సర్వే నంబర్ (403/52) తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేసినట్టుగా ఆరోపించారు. ఈ మేరకు పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వాస్తవానికి 403 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 నంబర్‌తో పార్థసారథి ఆక్రమణలకు పాల్పడినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలోనే షేక్‌పేట్ రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆ స్థలంలో ఆక్రమణలను తొలగింపు చేపట్టింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్‌తో పాటు లోపల ఉన్న షెడ్డులను తొలగించింది. అలాగే ఐదు ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేయడంతో పాటుగా, ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)