ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న "వాహనమిత్ర" పథకం కొత్త మార్గదర్శకాలు వెలువడ్డాయి. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ నిబంధనలు, లబ్దిదారుల ఎంపికలో కఠినతరం కానున్నాయి. ఈనెల 17వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాహనమిత్ర కింద ఆర్థిక సహాయం పొందాలంటే ముందుగా ఏపీలో వాహనం రిజిస్ట్రేషన్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్సు చెల్లుబాటులో ఉండాలి. ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వాహనం నడిపే డ్రైవర్లు మాత్రమే ఈ పథకానికి అర్హులు. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ వంటి పత్రాలు తప్పనిసరి. అయితే ఆటో రిక్షా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వారికి ఒక నెల గడువు ఇచ్చి, అప్పటిలోపు పొందాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హతల విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దరఖాస్తుదారు బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. రేషన్ కార్డు తప్పనిసరి. అయితే కుటుంబసభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ అయితే వారు అనర్హులు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మాత్రం ఈ నిబంధనలో మినహాయింపు ఉంటుంది. ఇంటి విద్యుత్తు వినియోగం. నెలకు 300 యూనిట్ల లోపు వినియోగం ఉన్నవారికి మాత్రమే అర్హులు. దరఖాస్తు చేసుకునే తేదీకి ముందు 12 నెలల సగటును లెక్కలోకి తీసుకుంటారు. అదేవిధంగా వాహనంపై పెండింగ్ బకాయిలు, ట్రాఫిక్ చలాన్లు ఉండకూడదు. వ్యవసాయ భూమి పరిమితి కూడా విధించారు. మాగాణి 3 ఎకరాలకు మించి, మెట్ట భూమి 10 ఎకరాలకు మించి ఉంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది. పట్టణాల్లో కూడా భూ పరిమితి నిబంధన అమల్లోకి వస్తుంది. వెయ్యి చదరపు అడుగులకంటే ఎక్కువ నివాసం లేదా వాణిజ్య నిర్మాణం ఉన్నవారు అనర్హులు. అంతేకాకుండా గతంలోనే ఆర్థిక సహాయం పొందిన లబ్దిదారుల వివరాలు మరోసారి గ్రామ, వార్డు సచివాలయాలు పరిశీలిస్తాయి. ఈ మార్గదర్శకాలతో అర్హులైన నిజమైన డ్రైవర్లు మాత్రమే లబ్ధి పొందేలా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
వాహన మిత్ర పథకానికి మార్గదర్శకాలు విడుదల
September 16, 2025
0
Tags