ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో దసరా రోజున వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించి ఒక్కో ఆటోడ్రైవర్ కు 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత ఆటో డ్రైవర్లు తమకు ఇబ్బంది కలుగుతుందని, తమకు జీవనోపాధి కరువవుతున్నదని పెద్ద ఎత్తున ఆందోళనల పర్వానికి శ్రీకారం చుట్టారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఒక్కో ఆటో డ్రైవర్ కు 15000 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, ప్రజల జీవన ప్రమాణం పెరగాలని చంద్రబాబు వ్యక్తం చేశారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్న ఆయన తమ ప్రభుత్వం జవాబుదారీ గల ప్రభుత్వమని, బాధ్యతతో పని చేస్తున్న ప్రభుత్వం అని అన్నారు. ఎన్ని కష్టాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి పార్టీలకు 95 శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర తిరగ రాశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదు కోట్ల మంది ఉచితంగా బస్సులో ప్రయాణించారని తెలిపారు. ఉచిత బస్సు పథకం జెట్ స్పీడ్లో దూసుకు వెళుతోందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తల్లికి వందనం అమలు చేసి తల్లుల నమ్మకాన్ని నిలబెట్టామని, ఒక్కొక్క విద్యార్థి కోసం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15వేల రూపాయలు ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. రైతన్నలకు అండగా ఉండడానికి అన్నదాత సుఖీభవ ని తీసుకువచ్చి 47లక్షల మంది ఖాతాలలో నగదు జమ చేశామన్నారు. దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, దీపం పథకం కూడా సూపర్ హిట్ అయిందని చంద్రబాబు పేర్కొన్నారు.
దసరా రోజున వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించి ఒక్కో ఆటోడ్రైవర్ కు రూ. 15 వేలు ఇస్తాం !
September 10, 2025
0
Tags