మాలేగావ్‌ పేలుడు కేసులో మోడీ పేరు చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు !

Telugu Lo Computer
0


మాలేగావ్‌ పేలుడు కేసులో ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భాగవత్‌ పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని జపా మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ ఆరోపించారు. ఈ కేసు విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు.''భాజపా సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ సహా పలువురి పేర్లు చెప్పాలని వారు నాపై ఒత్తిడి తెచ్చారు. నన్ను హింసించారు. నన్ను ఆసుపత్రిలో అక్రమంగా నిర్బంధించారు. నేను గుజరాత్‌లో నివసించడం వల్ల ప్రధాని మోడీ పేరు కూడా చెప్పించాలని చూశారు. నా చేత అబద్ధాలు చెప్పిం చాలని వారు ప్రయత్నించారు. అవి అబద్ధాలు కావడంతో నేను ఎవరి పేరు చెప్పలేదు'' అని ప్రజ్ఞ మీడియాతో చెప్పారు. మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసు విచారణ బృందంలో ఉన్న మాజీ ఏటీఎస్ అధికారి మహబూబ్‌ ముజావ్‌ కూడా ఇలాంటి ఆరోపణలే చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర లోని మాలేగావ్‌ ప్రాంతంలో 2008 సెప్టెంబరు 29న పేలుడు సంభవించింది. ఓ మసీదు సమీపంలో మోటార్‌ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్‌, పురోహిత్‌తో పాటు రమేశ్‌ ఉపాధ్యాయ్‌, అజయ్‌ రహీర్‌కార్‌, సుధాకర్‌ ద్వివేది, సుధాకర్‌ చతుర్వేది, సమీర్‌ కులకర్ణి ప్రధాన నిందితులుగా కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది. ''ఈ పేలుడుకు వినియోగించిన మోటార్‌బైక్‌.. మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ పేరు మీద రిజిస్టర్‌ అయిందని ప్రాసిక్యూషన్‌ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవు. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాల్లేవు'' అని తీర్పు వెలువరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)