బీహార్‌ ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం

Telugu Lo Computer
0


బీహార్‌ ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ ముసాయిదా జాబితాలో చేర్చిన వివరాలు ఇంకా వెబ్‌సైట్‌లో పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కానీ, ఓటర్లు ఈసీ వెబ్‌సైట్‌లో తమ పేర్లను చెక్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో సవరణలకు సెప్టెంబరు 1 వరకు గడువు కల్పించారు. అర్హులైన వ్యక్తుల పేర్లను జాబితాలో చేర్చడానికి, అనర్హులుగా భావించినవారి పేర్లను తొలగించడానికి పౌరులు, రాజకీయ పార్టీలు ఈలోగా ప్రతిపాదనలు చేయొచ్చని అధికారులు స్పష్టంచేశారు. ముసాయిదా జాబితాను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు రాష్ట్రంలో 7.93 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సవరణ చేపట్టగా.. కీలక విషయాలు బయటపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని వెల్లడైంది. 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఈసీ తెలిపింది. మరో ఏడు లక్షల మంది ఓటర్లు రెండుచోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. అయితే, ఈ సమగ్ర సవరణను కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఓటర్లను తొలగిస్తున్నారని దుయ్యబట్టాయి. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం వద్ద పెండింగ్‌లో ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)