బీహార్ ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్కు రెండు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయంటూ న్యాయవాది రాజీవ్ రంజన్ చేసిన ఫిర్యాదుపై పట్నాలోని దిఘా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది. శనివారం తేజస్వీ ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ తన పేరు సరికొత్త ఓటర్ల జాబితా నుంచి మాయమైందని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఎన్నికల అధికారులు జాబితాలను తెప్పించుకొని వెతికారు. బిహార్ యానిమల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం లైబ్రరీ బిల్డింగ్లోని పోలింగ్ బూత్ 204లో దానిని గుర్తించారు. జాబితాలో 416 నెంబర్లో తేజస్వీ వివరాలున్నాయని పేర్కొన్నారు. ఆయన ఎపిక్ నెంబర్ను RAB0456228గా పేర్కొన్నారు. కానీ, మాత్రం తన ఎపిక్ నెంబర్ RAB2916120గా వెల్లడించారు. అధికారులు మాత్రం ఆ సంఖ్యతో తాము ఆయనకు ఎపిక్ నెంబర్జారీ చేయలేదని పేర్కొన్నారు. దానిని తమకు అప్పగిస్తే.. దర్యాప్తు చేస్తామని చెప్పారు. వాస్తవానికి అంతకు ముందు తేజస్వీ ఎన్నికల కమిషన్ను ఉద్దేశించి మాట్లాడుతూ అసలు తన పేరే ఓటర్ జాబితాలో లేదని సంచలన ప్రకటన చేశారు. బిహార్లో ఓటర్ల ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసిన రోజే ఎన్నికల కమిషన్ భాజపా కోసం ఓట్లను చోరీ చేసిందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తేజస్వీ ప్రకటన రావడం గమనార్హం. దీనిపై భాజపా నాయకులు మండిపడ్డారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ రాహుల్, తేజస్వీ అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్(SIR)పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
రెండు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై పోలీసులకు ఫిర్యాదు
August 04, 2025
0
Tags