జమ్మూకాశ్మీర్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అన్ని వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దోడాలోని భలీసా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కాలువలు పొంగిపొర్లాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. జమ్మూలోని భగవతి నగర్ దగ్గర తావి నది వంతెన కూలిపోయింది. తావి నది దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనను భారీ వరద కొట్టడంతో ఒక్కసారిగా బ్రిడ్జి ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వంతెన కూలిపోయింది. వేగంగా వెళ్తున్న వాహనాలన్నీ కిందకి కూరుపోయాయి. అయితే చాకచక్యంగా ప్రయాణికులు తప్పించుకున్నారు. అయితే కొన్ని వాహనాలు కొట్టుకుపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది. అయినా కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. ఇక కాలువలు, నదులు, నల్లాలు పొంగి పొర్లుతున్నాయి. గాలి, వాన బీభత్సం సృష్టిస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్ను ముంచెత్తిన భారీ వర్షాలు : కూలిన తావి వంతెన
August 27, 2025
0
Tags