బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు. రాజకీయాలపై చర్చను పెళ్లిపైకి మళ్లించారు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ గురించి అడిగిన ప్రశ్నకు తేజస్వి యాదవ్ స్పందించారు. 'చిరాగ్ పాశ్వాన్ విషయం ఇవాళ్టిది కాదు. ప్రజలు కూడా ఆయన గురించి అడగడం లేదు. కానీ చిరాగ్ పాశ్వాన్ నాకు అన్నయ్య వంటి వారు. ఆయన వీలైనంత త్వరగా వివాహం చేసుకోవాలని నేను ఖచ్చితంగా సలహా ఇస్తా' అని అన్నారు. కాగా, తేజస్వి యాదవ్ పక్కన కూర్చున్న రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. ఈ సలహా తనకు కూడా వర్తిస్తుందని నవ్వుతూ అన్నారు. తాను పెళ్లి చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలంగా చెబుతున్నారని గుర్తు చేశారు. తన పెళ్లి విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు బీహార్లోని పూర్నియా జిల్లాలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కలిసి 'ఓటరు అధికార్ యాత్ర'ను కొనసాగించారు. ఓటర్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. అయితే ఓట్ల చోరీకి సర్ను వినియోగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించారని మండిపడ్డారు. 'ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉన్నది. అందుకే ఓట్ల తొలగింపుపై బీజేపీ ఒక్కసారి కూడా ఫిర్యాదు చేయలేదు' అని రాహుల్ గాంధీ అన్నారు.
చిరాగ్ పాశ్వాన్ పెళ్లి చేసుకోవాలని తేజస్వి యాదవ్ సలహా : ఈ సలహా తనకూ వర్తిస్తుందన్న రాహుల్
August 24, 2025
0
Tags