తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ముందుకు వెళ్తున్నాం : సీఎం రేవంత్‌రెడ్డి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఆసియా-పసిఫిక్ బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025 ఘనంగా జరిగింది. ఈ సమ్మిట్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బయోడిజైన్స్‌కు ఒక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలంగాణను 2047 నాటికి భారతదేశంలో ఒక ముఖ్యమైన ఆర్థిక శక్తిగా మార్చడమే లక్ష్యంగా ''తెలంగాణ రైజింగ్ 2047'' నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 2047 నాటికి భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతుందని, అప్పటికి మన దేశం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా మారిందని, సుల్తాన్‌పూర్‌లో భారత్‌లోనే అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్కును ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సుల్తాన్‌పూర్ పార్కులో 60కి పైగా కంపెనీలు ఉన్నాయని, ఇక్కడ ఇంప్లాంటేషన్లు, వైద్య పరికరాలు తయారు చేస్తున్నారని చెప్పారు. మన సామర్థ్యం, తెలివితేటలను ప్రజల కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. దీనికి తోడు, పరిశోధనల కోసం ప్రభుత్వం మెడికల్ డేటాను కూడా అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు టారిఫ్‌లు, వ్యాపార సమస్యలు, యుద్ధాలతో ప్రపంచం సతమతమవుతున్నప్పటికీ, ఇది ఇన్నోవేటర్స్, స్టార్టప్‌లు ఏర్పాటు చేసుకోవడానికి సరైన సమయం అని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)