ఆంధ్రప్రదేశ్ లో బాన్‌బ్లాక్ టెక్నాలజీస్ సంస్థ ప్రారంభం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం నియోజకవర్గం, కేసరపల్లి ఏపీఐఐసీ-ఏస్‌ అర్బన్‌ హైటెక్‌ సిటీలోని మేథా టవర్‌ లో బాన్‌బ్లాక్ టెక్నాలజీస్ సంస్థ 150 ఉద్యోగులతో ఇవాళ ప్రారంభమైంది. బాన్‌బ్లాక్ కంపెనీ ఫార్మా, హెల్త్, ఆటోమేటివ్, రిటైల్, ఆహార రంగాల్లో సేవలందించనున్నట్లు సీఈవో గోవింద రాజన్ తెలిపారు. త్వరలోనే బాన్‌బ్లాక్‌ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సైతం ఏర్పాటు కానుందన్నారు. వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా మారిన బ్లాక్ చైన్ కంపెనీలలో బాన్‌బ్లాక్ సంస్థ మొదటి పది సంస్థల్లో ఒకటిగా నిలిచిందని సీఈవో తెలిపారు. అమెరికాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న బాన్‌బ్లాక్‌ను ఏపీలోనూ విస్తరించడం గర్వంగా ఉందన్నారు. తమ కస్టమర్లకు తక్కువ సమయంలో నాణ్యమైన సాఫ్ట్ వేర్ సేవలను ఎక్కువ ఖర్చులేకుండా అందించడమే లక్ష్యమన్నారు. సంస్థ ఏర్పాటులో ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం మరువలేనివన్నారు. ఈ కంపెనీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ ప్రాజెక్టుల విషయంలో కస్టమర్లకు సంతృప్తికర సేవలందిస్తామన్నారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకమైన స్త్రీ శక్తిలోనూ ఈ సంస్థ భాగస్వామి కాబోతోంది. ప్రభుత్వం ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభిస్తున్న ఈ పథకంలో బాన్‌బ్లాక్ టెక్నాలజీస్ రూపొందించిన 'స్పాట్ బస్ ఐవోటీ డివైజ్‌'ను పైలట్ ప్రాజెక్టు కింద ఆర్టీసీ బస్సుల్లో అమరుస్తున్నట్లు సీఈవో గోవిందరాజన్ వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్, హోంమంత్రి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతులో మీదుగా ప్రారంభమయ్యే బస్సుల్లో వీటిని పైలట్ ప్రాజెక్టుగా అమర్చుతున్నట్లు తెలిపారు. ఈ పరికరాల ద్వారా ఆర్టీసీ బస్ కదలికలను ప్రత్యేకంగా అమర్చిన 360 డిగ్రీల కెమెరా ద్వారా రియల్ టైమ్ లో పర్యవేక్షణకు ఆ డివైజ్ లు ఉపయోగపడతాయన్నారు. నిఘా, అత్యవసర సేవలు, భద్రత, బస్సు నిర్వహణకు అవసరమైన డేటా మేనేజ్ మెంట్ విషయంలో పరికరాలు సహకారిస్తాయన్నారు. మహిళా సాధికారత, ప్రజా సేవకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలందించి రాష్ట్ర ఆవిష్కరణలలో కీలకమవుతామన్నారు. ఐటీ రంగం సహా అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్న ఏపీకి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బాన్‌బ్లక్ సంస్థకు చెందిన కార్పొరేట్ సర్వీసెస్ డైరెక్టర్ జమునాదేవి దయానిధి, పబ్లిక్ బిజినెస్ యూనిట్ డైరెక్టర్ సాయిరాం మత్తి పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)