20 ఏళ్లకు పైబడిన వెహికల్స్ ఆర్‌సీ రెన్యువల్‌ ఫీజు రెట్టింపు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలను నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇందుకోసం, వాహనదారులు అధిక రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయమై కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఈ నియమం వర్తించదు, ఎందుకంటే ఇక్కడ 15 సంవత్సరాల వయస్సు గల వాహనాలను నడపడంపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. కొత్త నియమాల ప్రకారం, 20 ఏళ్లు దాటి పాత వాహనాలకు ఆర్‌సీ రెన్యూవల్‌ ఫీజులను కేంద్ర ప్రభుత్వం గతంతో పోల్చితే రెట్టింపు చేసింది. పాత వాహనాల వినియోగాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రూల్ 81-4బీ కింద మాత్రమే ఆర్‌సీ రెన్యూవల్‌ కోసం అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా రూల్ 81 కింద 4సీ క్లాజ్ చేర్చింది. 20 ఏళ్లు దాటి ఉన్న వాహనాల ఆర్‌సీ రెన్యూవల్‌కు మార్గం సుగమం అయ్యేలా పద్ధతిని అందించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 20 ఏళ్లకు పైబడిన మోటార్ సైకిళ్ల ఆర్‌సీ రెన్యూవల్‌ ఫీజు రూ. 2,000 కి పెంచారు. అదే విధంగా త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ఈ రుసుము రూ. 5,000 కి పెరిగింది. దిగుమతి చేసుకున్న ద్విచక్ర, త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము రూ. 20,000 కాగా, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాలకు రూ. 80,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలపై జీఎస్‌టీ కూడా అదనంగా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)