ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులకు ఈనెల 13 వరకు రిమాండ్ పొడిగింపు

Telugu Lo Computer
0


విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా వున్న12 మంది ఇవాళ హాజరయ్యారు. తమకు బెయిల్ కావాలని వీరు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులు వేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. 12 మంది నిందితుల పిటిషన్లని కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా నిందితులకి ఈనెల 13 తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. కోర్టు విచారణ అనంతరం రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి కేంద్రకారాగారానికి తరలించారు. బాలాజీ, నవీన్‌లను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. మిగిలిన తొమ్మిది మంది నిందితులని విజయవాడ జిల్లా జైలుకి పోలీసులు తరలించారు. అయితే, లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లని ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏ35 బాలాజీ యాదవ్, ఏ36 నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్లని ఈ నెల 7వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో బాలాజీ గోవిందప్ప మెమో ఫైల్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో బాలాజీ గోవిందప్ప ఏ33గా ఉన్నారు. సిట్ దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్‌ట్యాప్, ల్యాబ్‌కు పంపాలని లేదా తమకు వెనక్కు ఇవ్వాలని మెమోలో తెలిపారు. సిట్ అధికారుల దగ్గర ఉంటే అందులో కంటెంట్ ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని మెమోలో బాలాజీ గోవిందప్ప పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)