ప్రియాంక గాంధీతో డీకే శివకుమార్ భేటీ

Telugu Lo Computer
0

ఢిల్లీలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ ఈ భేటీతో తారాస్థాయికి చేరింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య ఒప్పందం జరిగిందనే ప్రచారం బలంగా ఉంది. దీని ప్రకారం, తొలి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మిగిలిన కాలానికి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారమే త్వరలో డీకే ముఖ్యమంత్రి అవుతారని ఆయన వర్గం ఎమ్మెల్యేలు, మద్దతుదారులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.ముఖ్యమంత్రి కావాలనే తన ఆశను శివకుమార్ కూడా దాచుకోవడం లేదు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, "పదవిని ఆశించడంలో తప్పేముంది అంటూ తన మనసులోని మాటను పరోక్షంగా బయటపెట్టారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం తాను ఐదేళ్ల పూర్తికాలం పదవిలో కొనసాగుతానని ధీమాగా చెబుతున్నారు.ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రియాంక గాంధీతో డీకే శివకుమార్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. త్వరలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)