రైళ్లలో అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు

Telugu Lo Computer
0


రైళ్లలో అన్ని బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చాలని భారతీయ రైల్వే నిర్ణయించినట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుందని, ప్రయాణికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అరాచకాలకు పాల్పడుతున్న దుండగుల, వ్యవస్థీకృత ముఠాలను నిరోధించగలవని తెలిపారు. రైల్వే కోచ్‌లకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రయోగాత్మకంగా ఇటీవల నార్తరన్‌ రైల్వే పరిధిలో చేపట్టారు. అక్కడ విజయవంతమవడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, సహాయ మంత్రి రవనీత్‌ సింగ్‌ బిట్టూ, పలువురు ఉన్నతాధికారులు శనివారం సమీక్ష నిర్వహించినట్లు ఓ అధికారి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 74 వేల కోచ్‌లు, 15 వేల లోకో కోచ్‌లకు సీసీకెమెరాల ఏర్పాటుకు అశ్వినీ వైష్ణవ్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ''ప్రతి రైల్వేకోచ్‌ ద్వారాల వద్ద డోమ్‌ ఆకృతిలో సీసీ కెమెరాలు ఉంటాయి. లోకో కోచ్‌లకు ద్వారాలతోపాటు ముందు, వెనుకతో కలిపి ఆరు సీసీ కెమెరాలు అమరుస్తారు.'' అని రైల్వేశాఖ అధికారి వెల్లడించారు. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా అత్యంత నాణ్యతతో ఫుటేజీ వచ్చేలా జాగ్రత్తలు పాటించాలని అశ్వినీ వైష్ణవ్‌ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. చీకటిలోనూ వీడియో క్వాలిటీ బాగుండేలా అధునాతన సీసీకెమెరాలను అమర్చాలని ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అందుకు అవసరమైతే కృత్రిమమేధని కూడా వినియోగించాలని కోరినట్లు తెలుస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)