తెలంగాణ బీజేపీ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సెంట్రల్ జోన్, సైబర్ వింగ్కు ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ ఖాతాలో అభ్యంతరకరమైన, తప్పుడు కథనాలను పోస్ట్ చేస్తున్నారని, ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులలో గందరగోళం, విభేదాలకు కారణమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అసలు ఫేస్బుక్ ఖాతా గతంలో హ్యాక్ చేశారని, దీనిపై ఇప్పటికే ఫేస్బుక్ అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ప్రస్తుతం ఆ ఖాతా పనిచేయడం లేదని, తనకు వేరే ఫేస్బుక్ ఖాతా లేదని అధ్యక్షుడు రామచందర్ రావు వెల్లడించారు. నకిలీ ఫేస్బుక్ ఖాతా పార్టీ నాయకులలో, తమలో, పార్టీ కార్యకర్తలలో విభేదాలు సృష్టించడానికి సృష్టించారన్నారు. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద తీవ్రమైన నేరమని, పార్టీకి కూడా తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ నకిలీ ఫేస్బుక్ ఖాతాను ఎవరు సృష్టించారో క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని కోరారు. తమకు, తమ పార్టీకి మరింత నష్టం జరగకుండా తక్షణమే చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా : పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
July 23, 2025
0
Tags