పతంజలి ఉత్పత్తులు అమ్ముకోవడం కోసం పోటీ సంస్థల్ని తప్పుడు ప్రకటనలతో టార్గెట్ చేస్తున్న రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు. తన పోటీ సంస్థపై విద్వేషం వ్యాప్తి చేస్తూ పతంజలి సంస్థ నడుపుతున్న యాడ్స్ పై నిషేధం విధిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న డాబర్ చ్యవన్ ప్రాష్ పై విషం చిమ్ముతూ రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ ప్రసారం చేస్తున్న యాడ్స్ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ప్రకటనలో ఆయుర్వేద గ్రంథాలు, శాస్త్రీయ గ్రంథాల ప్రకారం చ్యవన్ప్రాష్ను తయారు చేసిన ఏకైక సంస్థ తమదేనని పతంజలి చెప్పుకుంటోంది. డాబర్ వంటి ఇతర బ్రాండ్లకు ప్రామాణికమైన జ్ఞానం లేదని కూడా తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనిపై డాబర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్న ఈ యాడ్స్ ను తక్షణం ఆపేయాలని ఆదేశాలు ఇచ్చారు. పతంజలి సంస్ధ తమ ప్రకటనలో "జింకో ఆయుర్వేద్ ఔర్ వేదో కా గ్యాన్ నహీ, చరక్, సుశ్రుత్, ధన్వంతరి ఔర్ చ్యవనృషి కే పరంపర మే 'అసల్' చ్యవనప్రాష్ కైసే బనా పయేంగే?" ( ఆయుర్వేదం, వేదాల్లో జ్ఞానం లేని వారు, చరక, శుశృత, ధన్వంతరి, చ్యవన రుషుల తరహాలో చ్యవన్ ప్రాష్ ఎలా తయారు చేయగలరు )అని డాబర్ ను ప్రశ్నిస్తోంది. ఈ యాడ్ పై స్టే ఇవ్వాలంటూ డాబర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే తమ పరువు నష్టం చేసినందుకు రూ.2 కోట్లు చెల్లించాలని కోరింది. దీనిపై తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
విద్వేషం వ్యాప్తి చేస్తూ పతంజలి సంస్థ నడుపుతున్న యాడ్స్ పై నిషేధం విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ
July 03, 2025
0
Tags