రష్యా నుంచి చమురు కొనుగోలుపై పాశ్చాత్య దేశాల విమర్శలను బ్రిటన్లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తోసిపుచ్చారు. ఏ దేశమూ అకస్మాత్తుగా తన ఆర్థిక వ్యవస్థను మూసివేయదని ఘాటుగా స్పందించారు. బ్రిటిష్ రేడియో స్టేషన్ టైమ్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారతదేశాన్ని ప్రశ్నిస్తున్న అనేక యూరోపియన్ దేశాలు వాళ్ల అవసరాల కోసం ఆ దేశాల నుంచే ఇంధనం, ఇతర వనరులు కొనుగోలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి ఇతర దేశాలు ఇంధనం కొనుగోలు చేయవద్దని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. ఎప్పటినుంచో మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తోంది. కానీ, ఉక్రెయిన్తో పోరు ఏళ్ల తరబడి కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు రష్యా భారీ తగ్గింపులో చమురు అమ్మకాలు ప్రారంభించింది. దీంతో ఉక్రెయిన్కు అండగా నిలబడుతున్న పాశ్చాత్య దేశాలు మాస్కో నుంచి చమురు దిగుమతి చేసే వారిపై మండిపడుతున్నాయి. చమురు, ఇతర వనరులేవీ దిగుమతి చేసుకోవద్దంటూ ఆంక్షలు విధించాయి. అయినా, ఇండియా చిరకాల మిత్రదేశంగా ఉన్న రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూనే ఉంది. అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉండటమే ఇందుకు కారణం.
రష్యా చమురు కొనుగోలుపై పాశ్చాత్య దేశాల విమర్శలను తోసిపుచ్చిన బ్రిటన్ భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి
July 28, 2025
0
Tags