కరెంట్‌ పోయిందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సిబ్బంది కర్రలతో దాడి

Telugu Lo Computer
0


విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో  ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై  గ్రేటర్‌ నోయిడాలో సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన గురువారం రాత్రి ఎకోవిలేజ్‌-1 సొసైటీలో చోటు చేసుకుంది. అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సొసైటీలో మూడు గంటలుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాత్రి కావడంతో ఉక్కపోతకు అల్లాడిన నివాసితులు మెయింటేనెన్స్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అక్కడ సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాసేపటికి మాటామాటా పెరిగి పెద్దగా మారింది. సహనం కోల్పోయిన సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్‌ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని కర్రలతో తీవ్రంగా బాదారు. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులోని ఓ వ్యక్తి తమకు రెండు నుంచి మూడు గంటల నుంచి కరెంట్‌ లేదని వాపోయారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన నలుగురు మెయింటేనెన్స్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ నోయిడా డీసీపీ శక్తి మోహన్ అవస్థి తెలిపారు. నిందితులను రవీంద్ర, సోహిత్, సచిన్ కుంతల్, విపిన్ కసానాగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)