ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలోని ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయినిపై మరో మహిళా ఉపాధ్యాయురాలు అసభ్యకరమైన మెసేజ్లతో వేధించారు. తప్పుడు ప్రచారం చేశారు. ఈ క్రమంలో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో దర్యాప్తులో ఆ టీచర్ గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. స్కూల్లో టీచర్లు అకారణంగా సెలవులు పెట్టొద్దని, స్కూల్లో, క్లాస్ రూమ్లలో ఉన్న సమయంలో మొబైల్స్ వినియోగించొద్దని ఆదేశించారు. ఈ క్రమంలో అదే స్కూల్లో పనిచేస్తున్న లేడీ టీచర్ ప్రధానోపాధ్యాయినిపై కక్ష పెంచుకున్నారు. ఆమెను ఎలాగైనా అల్లరి చేయాలని ప్లాన్ చేశారు. వెంటనే తన పని మనిషి పేరుతో ఓ సిమ్ కొనుగోలు చేశారు. స్కూల్ ప్రధానోపాధ్యాయినిపై బంధువులు, కుటుంబ సభ్యులతో పాటుగా తోటి టీచర్లకు అసభ్యకరమైన మెసేజ్లు పంపారు. ఈ మెసేజ్ల విషయం తెలియడంతో ప్రధానోపాధ్యాయిని మనస్తాపానికి గురయ్యారు. తనపై తప్పుడు ప్రచారం జరగడంతో ఆమె బాధపడ్డారు. వెంటనే ఏలూరు సైబర్ క్రైం పోలీసుస్టేషన్లో ఈ మెసేజ్ల అంశంపై ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు కేసును మహిళా పోలీసు స్టేషన్కు పంపారు. వాట్సాప్ మెసేజ్లు పెడుతున్న వ్యక్తి ఎవరో కనుగొనేందుకు స్కూల్కు వెళ్లి ఆరా తీశారు. చివరకు అదే స్కూల్లో పనిచేస్తున్న మహిళా టీచర్ ఈ నేరం చేసినట్లు గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే ఆ మహిళా టీచర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఈవోకు పోలీసులు లేఖ రాశారు. అలాగే స్కూల్లో లేడీ టీచర్కు మరికొందరు సహకరించినట్లు తెలిసిందని, విచారణ జరిపిన తర్వాత వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు ప్రభుత్వ టీచర్ల మధ్య మొదలైన చిన్న వార్ ఇలా కేసుల వరకు వెళ్లింది.
ప్రధానోపాధ్యాయురాలిపై వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు పంపిన ఉపాధ్యాయురాలు
June 03, 2025
0
Tags