జమ్మూకశ్మీర్ జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు అనుసంధానించే కెనాల్ ప్లాన్ ను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యతిరేకించారు. మొదట తమ జలాలను తాము వాడుకోవాలని, జమ్మూలో కరవు తరహా పరిస్థితి ఉందని, తామెందుకు పంజాబ్కు జలాలు పంపాలని ఆయన ప్రశ్నించారు. సింధు జాలాల వ్యవస్థ నుంచి జమ్మూకశ్మీర్ షేర్లోని మిగులు జలాలను పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్కు మళ్లించేందుకు 113 కిలోమీటర్ల కెనాల్ ప్రాజెక్టుకు ప్లాన్ జరుగుతోంది. దీనిపై ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, సింధు జలాల ఒప్పందం కింద పంజాబ్ ఇప్పటికే జలాలు పొందుతోందని చెప్పారు. 'మాకు అవసరమైతే వాళ్లు నీళ్లిస్తారా?' అని ప్రశ్నించారు. పఠాన్కోటలో షాపుర్కండి ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి 45 ఏళ్లుగా పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. 1979లో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినా కేంద్రం మధ్యవర్తిత్వంలో 2018లోనే ఇది కార్యరూపం దాల్చింది. పాత వివాదాన్ని ఒమర్ అబ్దుల్లా ప్రస్తావిస్తూ సింధు జలాల ఒప్పందం కింద ఇప్పటికే పంజాబ్కు నీళ్లందుతున్నాయని, మాకు అవసరమైనప్పుడు వాళ్లు నీళ్లిస్తారా అని ప్రశ్నించారు. తమను చాలా ఏళ్లుగా కంటతడిపెట్టేలా వాళ్లు చేశారని, ఇప్పుడు ముందుగా మేము జలాలు వాడుకుని, ఇతరుల గురించి ఆలోచిస్తామని చెప్పారు. కాగా, సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్కు ఉద్దేశించిన జలాలను పంజాబ్, రాజస్థాన్, హర్యానాకు మళ్లించాలని కేంద్రం నిర్ణయించినట్టు పలు మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై జలశక్తి మంత్రి ఇప్పటికే దృష్టి సారించారని చెబుతున్నారు. పాకిస్థాన్కు వెళ్లే చుక్కనీరు కూడా వృథా కారాదని మంత్రిత్వ శాఖ పట్టుదలగా ఉందని చెబుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్పై కఠిన చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.
ఉత్తరాది రాష్ట్రాలకు అనుసంధానించే కెనాల్ ప్లాన్ ను వ్యతిరేకించిన ఒమర్ అబ్దుల్లా
June 20, 2025
0
Tags