కరోనా నియంత్రణకు మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను విడుదల చేసింది వైద్య ఆరోగ్యశాఖ. విశాఖతో పాటు చాలా జిల్లాల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. వరుసగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పలు సూచనలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు సైతం రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతం మాదిరిగా కొన్ని రకాల ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, రాజకీయ పార్టీల బహిరంగ కార్యక్రమాలు వంటి అన్ని సామూహిక సమావేశాలను తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వం పేర్కొంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ ప్రవర్తన నియమావళి పాటించాలని స్పష్టం చేశారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులను, గర్భిణీ స్త్రీలను కచ్చితంగా ఇంటి లోపల ఉండాలని సూచించారు. పరిశుభ్రతను పాటించాలని, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గు/ తుమ్ములు వచ్చినప్పుడు నోటిని కప్పి పదే పదే ముఖాన్ని తాకడం వంటి పనులు చేయకూడదని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, రద్దీ ప్రదేశాలు, తక్కువ గాలి ప్రసరణ ఉన్న ప్రదేశంలో ఉంటే విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. కోవిడ్ సంబంధిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని, నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వ్యక్తికి విధిగా పరీక్షలు చేయించాలని వైరస్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే హోమ్ క్వారంటైన్ కి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ల్యాబ్ లు 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)