పెద్ద మొత్తంలో అన్ సెక్యూర్డ్ రుణాలు మాఫీ!

Telugu Lo Computer
0


2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకులు అన్ సెక్యూర్డ్ రుణాలను పెద్ద మొత్తంలో మాఫీ చేశాయి. ఇది వారి బ్యాలెన్స్‌ పుస్తకాలను గణనీయంగా ప్రభావితం చేసింది. దేశంలోని ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025 ఏడాదిలో తమ రుణాల మాఫీల్లో పెరుగుదలను నమోదు చేశాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.17,645 కోట్లతో పోలిస్తే ఎస్‌బీఐ రూ.26,542 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.6,091 కోట్ల నుంచి రూ.9,271 కోట్ల రుణాలు మాఫీ చేశాయి. యాక్సిస్ బ్యాంక్ మొండి బకాయిల మాఫీలను రూ.8,865 కోట్ల నుంచి రూ.11,833 కోట్లకు పెంచింది. ఈ రుణ మాఫీల్లో అధిక భాగం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లోని తక్కువ విలువ ఉన్న రుణాలే కావడం గమనార్హం. ఈ రుణాల మాఫీలో భాగంగా బ్యాంకులు క్రమం తప్పకుండా వాటి ప్రొవిజన్ కవరేజీని అంచనా వేస్తాయి. పూర్తిగా రికవరీ అయిన ఖాతాలను పుస్తకాల నుంచి తొలగిస్తాయి. ఈ విధానం రుణదాతలకు ఆర్థిక క్రమశిక్షణను నిర్వహించడానికి సహాయపడుతుంది. అయితే ఈ రుణ పద్ధతుల్లో నిర్మాణాత్మక ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొండిబకాయిల పెరుగుదలపై చాలాకాలంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆర్థిక సంస్థల ఆస్తుల నాణ్యతను దిగజార్చడం, అండర్ రైటింగ్ ప్రమాణాలను నీరుగార్చడం వంటి చర్యలకు ఇవి తావిస్తున్నాయని ఆర్‌బీఐ పేర్కొంటోంది. బ్యాంకులు దూకుడుగా రుణాలను మాఫీ చేస్తున్న నేపథ్యంలో నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, పటిష్టమైన రుణ విధానాలను ఏర్పాటు చేసుకోవాలని, రిస్క్ మేనేజ్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌లను బలోపేతం చేయాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశిస్తోంది. పూచీకత్తులేని రుణాలను మాఫీ చేయడం చిన్న ఆర్థిక సంస్థలకు సవాలుగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల బ్యాంకులు రుణ నిబంధనలను కఠినతరం చేయవచ్చు. దీనివల్ల చిన్న వ్యాపారాలు, వ్యక్తులు రుణాలు పొందడం కష్టమవుతుంది. కొత్తగా రుణాల కోసం చూస్తున్నవారి దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంటుంది. మాఫీల నుంచి నష్టాలను భర్తీ చేయడానికి బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)