కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్- నెల్లూరు నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కి.మీల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనుంది. బద్వేల్లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నిర్మాణం చేపట్టే ఈ కారిడార్తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది. అలాగే, ఈ కారిడార్ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది. గత 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం ఎంఎస్పీ పెంపును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందన్నారు. ఆయా పంటలకు ఎంఎస్పీ కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లుతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వరి సహా మొత్తం 14 ఖరీఫ్ పంటలకు క్వింటాల్పై కనీస మద్దతు ధర కేంద్రం పెంచింది. వీటిలో వరి సాధారణ, గ్రేడ్- ఏలకు రూ.69 పెంచగా.. జొన్నలు రూ. 328, సజ్జలు రూ.150; రాగులు రూ.596, మొక్కజొన్న రూ.175, కందిపప్పు రూ.450, పెసర రూ.86, మినుములు రూ.400, వేరుశెనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, కుసుమలు రూ.579, వలిశలు (గడ్డినువ్వులు) రూ.820, పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధరను పెంచారు.
బద్వేల్- నెల్లూరు నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
May 28, 2025
0
Tags