ఇరాన్కు వెళ్లిన ముగ్గురు భారత యువకులు అదృశ్యమయినట్లు అక్కడి భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. తప్పిపోయిన భారత పౌరుల ఆచూకీ కనుగొనాలని టెహ్రాన్లోని అధికారులను కోరింది. తప్పిపోయిన వారిని పంజాబ్కు చెందిన సంప్రీత్, అమృత్పాల్, జస్పాల్గా పేర్కొంది. ఇటీవల మరో ఇద్దరు యువకులతో ఇరాన్కు వెళ్లిన తన కుమారుడు కొద్ది రోజులుగా తమకు అందుబాటులోకి రావట్లేదని, వారి సమాచారం తెలియట్లేదని హుస్న్ప్రీత్ తల్లి పంజాబ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఏజెంట్ల సహాయంతో వారు ఢిల్లీ మీదుగా డంకీ రూట్లో ఉద్యోగాల కోసం ఆస్ట్రేలియాకు బయల్దేరారని, వారిని తీసుకువెళ్లిన ఏజెంట్లు తాత్కాలికంగా బస చేద్దామని నమ్మించి మే 11వ తేదీన వారిని ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని అధికారులకు తెలియజేశారు. వారిని తాళ్లతో కట్టేసి ఉన్న ఫొటోలు తమకు పంపారని, ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని వాపోయారు. వీలయినంత త్వరగా తమ వారిని విడిపించాలని యువకుల కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో రాయబార కార్యాలయం ఈ విషయంలో ఇరాన్ అధికారుల సహాయం కోరింది. అదృశ్యమైన భారతీయులను తక్షణమే గుర్తించాలని, వారి భద్రతను నిర్దారించాలని అభ్యర్థించింది.
ఇరాన్లో ముగ్గురు భారత యువకులు కిడ్నాప్ ?
May 28, 2025
0
Tags